ఆదిపురుష్‌ థియేటర్లో దళితులకు ప్రవేశం లేదా..?

రామాయణ పారాయణం జరిగే చోట పవిత్రంగా ఉండాలనేది మా నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ, ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమా ప్రదర్శించే థియేటర్లలో దళితులకు ప్రవేశం లేదు. ఆదిపురుష్ పోస్టర్ పై కనిపించిన స్టేట్ మెంట్ ఇది. దీంతో ఒక్కసారిగా పౌరసమాజం భగ్గుమంది. ఆదిపురుష్ సినిమాను దళితులు చూడకూడదా? ఇది నిజంగానే మేకర్స్ నుంచి వచ్చిన పోస్టరా..? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ప్రచారంలో ఉన్న ఈ పోస్టర్ గురించి ఆదిపురుష్ మేకర్స్ స్పందించారు.

ఆదిపురుష్ యూనిట్ సమానత్వానికి కట్టుబడి ఉందని, ప్రేక్షకుల మధ్య ఎలాంటి వర్ణవివక్ష, కులవివక్ష, పక్షపాతం చూపించదని ప్రకటించింది. ఆదిపురుష్ పోస్టర్ పై వచ్చిన పై ప్రకటనతో యూనిట్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన యూనిట్, ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ఎవరూ ప్రోత్సహించొద్దని విజ్ఞప్తి చేసింది. మరో వైపు ఈ వ్యవహారంపై తిరుపతి పోలీసులు కూడా దృష్టిసారించారు. ఈ పోస్టర్ తిరుపతి కేంద్రంగా బయటపడిందని పోలీసుల విచారణలో తేలింది. ఈ పోస్టర్ ను వైరల్ చేయద్దని.. ఎవరైనా ఈ పోస్టర్ తో ప్రచారం చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి ఎస్పీ హెచ్చరించారు.