రజినీ, రామ్ కాంబోలో మల్టీస్టారర్ సాధ్యమేనా..?

ఇప్పుడు భారీ మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తోంది. అందులోనూ ఒకే భాషలో కాకుండా.. వేరే వేరు భాషల్లో హీరోలు కలిసి నటించడం అనేది ట్రెండ్ అయ్యింది. కల్కి దగ్గర నుంచి ఈ మల్టీస్టారర్ ట్రెండ్ మరింతగా పెరిగింది. అయితే.. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajnikanth), టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్(Ram pothineni) కలిసి నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ క్రేజీ కాంబో మూవీకి డైరెక్టర్ ఎవరు..? ఈ వార్తల వెనకున్న వాస్తవం ఏంటి..?

ఎనర్జిటిక్ హీరో రామ్ ఇస్మార్ట్ శంకర్ మూవీతో మాస్ లో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఆతర్వాత మాస్ కు మరింత దగ్గరవ్వాలని చేసిన రెడ్, వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. దీంతో ఆలోచనలోపడిన రామ్ ఇప్పుడు మాస్ మూవీ కాదు.. డిఫరెంట్ కంటెంట్ మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాడట. కరెక్ట్ గా ఇలాంటి టైమ్ లోనే డైరెక్టర్ మహేష్(P.mahesh babu) ఓ కథ చెప్పాడట. ఈ కథ బాగా నచ్చడంతో రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. డైరెక్టర్ మహేష్.. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అనే సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ విభిన్న కథా చిత్రం కమర్షియల్ సక్సెస్ కూడా సాధించింది.

డైరెక్టర్ మహేష్ చెప్పిన కథలో సీనియర్ హీరో చేయాల్సిన క్యారెక్టర్ ఉందట. ఆ క్యారెక్టర్ కోసం బాలకృష్ణను కాంటాక్ట్ చేశారట. అయితే.. ప్రస్తుతం బాలకృష్ణ బిజీగా ఉండడంతో సున్నితంగా నో చెప్పారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. బాలకృష్ణ నో చెప్పడంతో సూపర్ స్టార్ రజినీకాంత్ ను కాంటాక్ట్ చేశారని.. ఈ మూవీ స్టోరీ.. అందులో క్యారెక్ట్రర్ నచ్చడంతో ఓకే చెప్పారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రజినీకాంత్ కూలీ మూవీలో నటిస్తున్నారు. వైజాగ్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. జైలర్ మూవీ సక్సెస్ తో రజినీ ఫామ్ లోకి వచ్చారు. దీంతో వరుసగా సినిమాల్లో నటించేందుకు ఓకే చెబుతున్నారు. రామ్ మూవీలో రజినీ నటించడం అనేది నిజమా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.