భారీ వర్షాలు, వరదలతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీరికి తమ వంతు సహాయం అందించేందుకు తెలుగు స్టార్స్ ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్(NTR), మహేశ్ బాబు(Mahesh babu), బాలకృష్ణ, పవన్ కల్యాణ్(Pawan kalyan) కోటి రూపాయల చొప్పున విరాళం ప్రకటించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తన వంతుగా కోటి రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.50 లక్షలు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.50 లక్షలను వరద బాధితుల(Flood victims) సహాయార్థం విరాళంగా చిరంజీవి ప్రకటించారు.
చిరంజీవి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ – ‘‘తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం వుంది. ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాల లో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నాను. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు