ప్రశాంత్ వర్మ లైనప్ అదిరింది

అ, కల్కి, జాంబిరెడ్డి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుని.. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashant varma). హనుమాన్(Hanuman) సీక్వెల్ జై హనుమాన్(jai Hanuman) మూవీని ప్రకటించారు కానీ.. ఇంత వరకు సెట్స్ పైకి వెళ్లలేదు. అయితే.. ఇప్పుడు ప్రశాంత్ వర్మ లైనప్ అదిరింది అంటూ ప్రచారం జరుగుతోంది. ఇంతకీ.. నెక్ట్స్ ఏంటి..? ప్రచారంలో ఉన్న లైనప్ ఏంటి..? హనుమాన్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడంతో ఈ సినిమా ఇచ్చిన కిక్ తో వెంటనే సీక్వెల్ చేయాలి అనుకున్నారు. సీక్వెల్ టైటిల్ జై హనుమాన్ అని కూడా ప్రకటించారు. అయితే.. ఈ సీక్వెల్ స్టోరీ అంతా హనుమాన్ చుట్టూ తిరుగుతుందట. హనుమాన్ పాత్రలో నటించేది ఎవరు అనేది కన్ ఫర్మ్ కాలేదు. అందుకనే ఈ మూవీ సెట్స్ పైకి రాలేదని సమాచారం.

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తొలి సినిమా బాధ్యతలను ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టారని తెలిసింది. అభిమన్యుడు క్యారెక్టర్ లో మోక్షజ్ఞను చూపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అనౌన్స్ చేస్తారని సమాచారం. ఈ మూవీ తర్వాత ప్రశాంత్ వర్మ డీవీవీ దానయ్య కుమారుడు దాసరి కళ్యాణ్ ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేయనున్నాడు. గతంలో ఈ సినిమాను అనౌన్స్ చేశారు. అధీర టైటిల్ తో రూపొందే ఈ సినిమాను ప్రశాంత్ వర్మ శిష్యుడు తెరకెక్కిస్తాడు కానీ.. ప్రశాంత్ వర్మ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తాడని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ప్రశాంత్ వర్మ లైనప్ అదిరింది. మరి.. ఈ సినిమాలతో కూడా సక్సెస్ సాధిస్తే.. మరింత క్రేజ్ పెరగడం ఖాయం.