స్పిరిట్ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడంటే ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో మూవీ ప్రకటించారు. మరోవైపు ప్రభాస్, హను మూవీ కూడా పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేయడం జరిగింది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. మరి.. ప్రభాస్, సందీప్ ల స్పిరిట్ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడనేది ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ మూవీ చేస్తున్నారు. మారుతి తెరకెక్కిస్తోన్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఇప్పటి వరకు యాభై శాతం షూటింగ్ పూర్తయ్యింది. ఇటీవల రిలీజ్ చేసిన ది రాజాసాబ్ గ్లింప్స్ కు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమాతో పాటు కల్కి 2 సెట్స్ పై ఉన్నాయి. అలాగే సలార్ 2 కూడా స్టార్ట్ చేయాల్సివుంది. ఇటీవల హను రాఘవపూడి డైరెక్షన్ లో మూవీని ప్రారంభించారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ప్రభాస్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు.

మరి.. స్పిరిట్ అప్ డేట్ ఏంటంటే.. సందీప్ రెడ్డి ప్రస్తుతం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. మూడు లేదా నాలుగు నెలల్లో కాస్టింగ్ అండ్ టీమ్ ఎవరు అనేది ఫైనల్ చేస్తారు. ఈ మూవీని అక్టోబర్ నుంచి స్టార్ట్ చేయాలి అనుకున్నారు కానీ కుదరడం లేదు. ఆతర్వాత డిసెంబర్ నుంచి ఈ మూవీ స్టార్ట్ చేస్తారని టాక్ వినిపించింది కానీ.. జనవరి నుంచి ఈ సినిమాని స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇందులో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటించనున్నారు. సందీప్ రెడ్డి వంగ సినిమా అంటే.. రెగ్యులర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. పైగా యానిమల్ తర్వాత చేస్తోన్న మూవీ కావడంతో స్పిరిట్ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. మరి.. ప్రభాస్, సందీప్ కలిసి సరికొత్త రికార్డులు సెట్ చేస్తారేమో చూడాలి.