“రాజా సాబ్”తో నష్టాలన్నీ భర్తీ అవుతాయంటున్న నిర్మాత

టాలీవుడ్ లోకి ఒక కెరటంలా దూసుకొచ్చిన నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People media factory). అతి తక్కువ టైమ్ లో స్టార్ హీరోలతో పాటు కంటెంట్ ఉన్న మీడియం బడ్జెట్ మూవీస్ చేస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ గా నిలబడింది. ఈ సంస్థ నుంచి రీసెంట్ గా రిలీజైన మిస్టర్ బచ్చన్(Mr bachan) సినిమా ప్రేక్షకాదరణ పొందలేదు. ఈ విషయాన్ని నిర్మాత టీజీ విశ్వప్రసాద్(TG vishwaprasad) రీసెంట్ ప్రెస్ మీట్ లో వెల్లడించారు. మిస్టర్ బచ్చన్ పేరు చెప్పకుండా తమ సంస్థ నుంచి వచ్చిన రీసెంట్ మూవీ ఆర్థికంగా నష్టాలు తీసుకొచ్చిందని ఆయన అన్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న శ్వాగ్(Swag) సినిమా టీజర్ లాంఛ్ లో టీజీ విశ్వప్రసాద్ పాల్గొన్నారు. మనమే సినిమా పెద్దగా లాస్ తీసుకురాలేదని సేఫ్ గానే ఉన్నామని అయితే రీసెంట్ మూవీ (మిస్టర్ బచ్చన్) ఆర్థికంగా నష్టపోయామని ఆయన అన్నారు. తమ సంస్థకు వచ్చిన లాస్ లు అన్నీ ప్రభాస్ రాజా సాబ్ తో తీరిపోతాయనే నమ్మకం ఉందని టీజీ విశ్వప్రసాద్ చెప్పారు. రవితేజ హీరోగా దర్శకుడు హరీశ్ శంకర్ రూపొందించిన మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ దగ్గర బౌన్స్ అయ్యింది.